16, మార్చి 2016, బుధవారం

శాస్త్రవేత్తల పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు మరియు స్వామీ వివేకానంద పుస్తకాల ప్రదర్శన మరియు అమ్మకాలు - మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవం వేడుకలు సందర్భంగా

మా బడిలో జాతీయ సైన్సు దినోత్సవం వేడుకల సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకొంటున్నాము అని బ్లాగర్ మిత్రులకు వారు ఫోన్ చేసిన సందర్భంగా  తెలియచేయగానే సాంప్రదాయబద్దంగా మూస పద్ధతిలో కాకుండా మీ బడిలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను విభిన్నంగా ఏర్పాటు చేయాలనీ..., దానికోసం  మా బడి పిల్లలకు, ప్రదర్శన చూడడానికి వచ్చిన వివిధ బడుల్లోని  పిల్లలకు మరియు  ఉపాధ్యాయులకు ఉపయుక్తంగా ఉండేలాగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనతో బాటు...,  సైన్సు , శాస్త్రవేత్తల పుస్తకాల ప్రదర్శనకు వుంచి వాటిని తగు రాయితీతో అమ్మకాలకు కూడా ఉంచమని చెప్పారు. అంతేకాకుండా మంచి పౌరులుగా పిల్లలు ఎదగాలంటే విజ్ఞానమే కాదు ఉన్నత విలువలు వారికి అలవరచాలనీ   మరియు ఎటువంటి క్లిష్ట పరిస్తితుల నైనా సమర్ధవంతంగా ఎదుర్కొనే ఆత్మవిస్వాసం  పిల్లల్లో  ఇప్పటినుంచే ప్రోదిచేయాలని ...,  అందుకు ఉపయుక్తంగా ఉండే స్వామీ వివేకానంద గారి పుస్తకాలను కూడా ప్రదర్శనకు మరియు అమ్మకాలకు వుంచాలని సూచించారు. మరి ఈ పుస్తకాలన్నింటినీ తెచ్చి ప్రదర్శనకు అమ్మకాలకు ఉంచాలంటే సుమారు పదిహేను వేల రూపాయలు అవసరమౌతుంది. నారు పోసినవాడు నీరుపోయడా? అనే చందాన సలహా ఇచ్చిన బ్లాగర్ మిత్రులు సలహా అమలుకు కావలసిన పుస్తకాలను వారే స్వయంగా ఆన్ లైన్ షాపింగ్ పద్ధతిలో  "మంచి పుస్తకం డాట్ కాం" వారి ద్వారా విలువైన మరియు అరుదైన  సైన్సు మరియు శాస్త్రవేత్తల పుస్తకాలను విద్యా వైజ్ఞానిక ప్రదర్శన తేదీ కన్నా చాల రోజుల  ముందుగానే నాకు అందేలా చేశారు. మరి ఆన్ లైన్లో దొరకని స్వామీ వివేకానంద  గారి పుస్తకాలను వాటితో పాటు అబ్దుల్ కలాం గారి పుస్తకాలను, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుస్తకాలను రామకృష్ణ మటం మరియు ప్రముఖ పుస్తకాల షాప్ ల  నుండి  హైదరాబాదు లోని బ్లాగర్ మిత్రులు విజయ్ గారి ద్వారా  కొనుగోలు చేయించి  పార్సిల్ సర్వీసు ద్వారా    నాకు సకాలంలో అందేలాగా చేశారు. వీటితోబాటు  ఆరోగ్యం - ఆహారం సంబంధించి  ప్రముఖ రచయిత డాక్టర్ జీ వీ పూర్ణ చందు గారి పుస్తకాలను "కినిగే డాట్ కాం" ద్వారా నాకు అందేలాగా చేశారు. ఈ పుస్తకాలన్నిటినీ  విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఒక గదిలో ప్రదర్శనకు మరియు అమ్మకాలకు వుంచడం జరిగింది. వీటితోపాటూ పెద్దలు  శ్రీధర మూర్తి గారి సౌజన్యంతో (రామకృష్ణ మటం అనంతపురం) నరేంద్రుడు  స్వామీ వివేకానందగా పరివర్తన చెంది భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పి భారతదేశాన్ని ప్రపంచలో సమున్నత స్థానంలో నిల్పిన వివిధ దశల  చిత్రపటాల మాలికను కూడా ఆ గదిలో ప్రదర్శనకు వుంచడం జరిగింది. ఈ ప్రదర్శనకు విచ్చేసిన కొలిమిపాల్యం ఉన్నత పాటశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీధర్ గారిని పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని  ప్రారంబించమని కోరగా వారు మా బడి చిన్నరితోనే పుస్తక ప్రదర్శనను ప్రారంభింప చేసి పిల్ల పట్ల వారికున్న ప్రేమను చాటుకున్నారు. అలాగే ప్రదర్శనను చూసి చాల బాగుందని మమ్మల్ని అభినందించి కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు, అంతేకాకుండా 700 రూపాయలను మాకు ఇచ్చి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో  భాగస్వామ్యులైన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఉపయుక్తమైన పుస్తకాలను బహుమతులుగా ఇవ్వమని చెప్పి పిల్లల పట్ల తన ప్రేమను మరొకసారి చాటుకున్నారు. వారి కోరికమేరకు ఆ విద్యార్థులందరికీ పుస్తకాలను బహుమతులుగా వారి పేరుమీదుగా ఇవ్వడం జరిగింది. ప్రదర్శన చూడడానికి వచ్చిన గ్రామ సర్పంచ్ శ్రీ రామన్న గారు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చి కొన్ని పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది. తరువాత పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ కలిసి సుమారు ఆరు వేల రూపాయల పై చిలుకు విలువ చేసే  పుస్తకాలను కొనుగోలు చేశారు. పుస్తకాల అమ్మకాల ప్రక్రియను పర్యవేక్షించడానికి హిందీ పండితులు సురేష్ బాబు గారిని కోరగా వారు ఆ బాధ్యతలను సంతోషంగా స్వీకరింఛి విజయవంతగా పూర్తి చేశారు. ఇలా పుస్తకాలను అమ్మగా వచ్చిన డబ్బుకు మరికొంత డబ్బును విరాళంగా సేకరించి మొత్తం  డబ్బును ఈ మధ్యనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేపట్టిన గంగా నది ప్రక్షాళన కార్యక్రమమైన నమామి గంగే ప్రాజెక్టు కు  విరాళముగా డీ.డీ. రూపములు మా బడి తరఫున పంపాలని నిర్ణయించుకున్నాము. మా  బడిలో మేము చేస్తున్న నూతన ఒరవడి యొక్క  వడినీ, వాడినీ పెంచే విధంగా నూతన సొబగులద్డుతున్న బ్లాగర్ మిత్రులకు, మాకు ఎల్లవేళలా సహకారం అందిస్తున్న గ్రామ  సర్పంచ్ రామన్న గారికి , ఆర్డీవో శ్రీ రామారావు గారికి, ఎమ్మార్వో శ్రీ వాణి గారికి, కొలిమిపాల్యం ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీధర్ గారికి, ఈ కార్యక్రమం విజవంతం కావడానికి తోడ్పడ్డ  వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు....  


















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి